హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫ్యూచర్ సిటీ, శామీర్పేట్, మేడ్చల్ మెట్రో మార్గాల డీపీఆర్లు (సమగ్ర వివరాత్మక ప్రణాళికలు) మార్చి నెలాఖరుకి పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం-ఫ్యూచర్ సిటీ మెట్రో (40 కి.మీ.), జేబీఎస్-శామీర్పేట్ మెట్రో (22 కి.మీ.), ప్యారడైజ్-మేడ్చల్ మెట్రో (23 కి.మీ.) మార్గాలకు భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. డీపీఆర్లకు కేంద్రం ఆమోదం పొందిన వెంటనే ఏప్రిల్ నెలాఖరుకి టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు.
సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. శామీర్పేట్, మేడ్చల్ మెట్రోలు ఒకే స్థలంలో ప్రారంభమయ్యేలా భారీ జంక్షన్ ఏర్పాటు చేయాలని, ఈ జంక్షన్లో ఆధునాతన సౌకర్యాలను కల్పించడంతో పాటు స్థానిక ప్రజలకు అవసరమైన అన్ని సేవలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జంక్షన్ డిజైన్లో భవిష్యత్ విస్తరణ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.
హెచ్జీసీఎల్ (హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్) ఆధ్వర్యంలో రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని, ఎలైన్మెంట్ రూపొందించేటప్పుడు క్షేత్ర స్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలని సీఎం స్పష్టం చేశారు. మేడ్చల్ మార్గంలో ఇప్పటికే ఉన్న మూడు ఫ్లైఓవర్లను దృష్టిలో ఉంచుకొని మెట్రో లైన్ను ప్రణాళికబద్ధంగా రూపొందించాలని సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలన్నారు.
ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మౌలిక వసతుల సలహాదారు శ్రీనివాస రాజు, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పురపాలక-పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దానకిశోర్, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్.వి.ఎస్.రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఫ్లాగ్షిప్ కార్యక్రమాల కమిషనర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.