AHMEDABAD| అహ్మదాబాద్ AEROPLANE| విమాన దుర్ఘటన నుంచి మనం ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. సాంకేతిక లోపమో, మానవ తప్పిదమో కానీ, మారణహోమం జరిగిపోయింది. ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో ఆ విమానాన్ని ఎక్కిన వారు గమ్యాన్ని ముద్దాడక ముందే మృత్యువుని ముద్దాడారు. ఎంతో నమ్మకమైన, భద్రంగా పేరున్న AIR INDIA| ఎయిర్ ఇండియా విమానం పూర్తిగా ఎయిర్ లోకి వెళ్ళక ముందే కుప్పకూలిపోయింది. విమానాన్ని గమ్యానికి చేర్చే ట్యాంక్ నిండా ఉన్న ఫ్యూయల్ అందులోని వాళ్ళని మంటల్లో మాడ్చి మసి చేసింది. ఒకేసారి వెయ్యి డిగ్రీల వేడిని రగిల్చిన ఆ మంటలకు అందులోని ప్రయాణీకులు, సిబ్బంది, పైలట్ సహా అంతా కాలిబూడిదైపోయారు. ఒకే ఒక్కడు మృత్యుంజయుడైయ్యాడు. తనను తానే నమ్మలేని విధంగా బతికి బట్టకట్టాడు.
గగన ప్రయాణం గరళ ప్రయాణంగా మారిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం పౌర విమాణ చరిత్రలోనే అత్యంత విషాదాన్ని మిగిల్చింది. విమానం ఎగిరిన కొద్ది నిమిషాల్లోనే నేలకొరిగింది. మంటల్లో మాడిపోయింది. యంత్రాలు పని చేయలేదో? మరెదో? కానీ, పైలట్ ఇచ్చిన సమాచారానికి, సమాధానం కూడా వినలేని దీన స్థితిలో అది కూలిపోయింది. బహుషా జనావాసాల్లో కూలిపోకుండా పైలట్ తీసుకున్న జాగ్రత్త వల్లనో ఏమో పక్కకు తప్పించబోయినా, అది పైలట్ చేతిలో లేకుండా పోయి, మెడికల్ కాలేజీ భవనంలోకి దూసుకుపోయింది. దీంతో డాక్టర్లు, మెడికోలు ఈ ప్రమాదంలో మరణించారు. జానవాసాల్లోని కొందరు మృత్యువాతపడ్డారు. మొత్తానికి ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం ఘోర విషాదాన్ని నింపింది. విమానంలోని 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బంది మొత్తం 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు బతికారు. విమానం కూలిన వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయం ధ్వంసమై 33 మంది వరకూ మృతి చెందడటంతో మృతుల సంఖ్య 274కు చేరింది.
2009లో 787-8 డ్రీమ్ లైనర్ ప్రపంచంలో వాడుకలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన తొలి ప్రమాదం కూడా ఇదే కావడం విశేషం. బోయింగ్ 787 లోపభూయిష్టమని, ప్రయాణికులకు ప్రమాదకరమని సలోహ్పోర్ అనే విజిల్బ్లోయర్ ఏడాది క్రితమే హెచ్చరించారని ప్రచారం జరుగుతోంది. లోపాల కారణంగా విమానం పదేపదే ప్రయాణించిన తర్వాత ముక్కలైపోవచ్చని చెప్పారట. ఆ సమస్యే ఎయిర్ ఇండియా విమానం కూలడానికి కారణం కావచ్చని అన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే విమాన ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవచ్చని కూడా తన వాంగూల్మంలో పేర్కొన్నారు. ఇప్పుడు సలోహ్పోర్ అనుమానమే నిజమైందా?
ఇక విమానం కూలిన ప్రదేశంలో దొరికిన బ్లాక్ బాక్స్ ఆధారంగా ప్రమాద కారణాలను అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాయిస్, సిస్టమ్ డాటాను విశ్లేషిస్తున్నారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
విమానం కూలిపోయే సమయంలో పరిస్థితిని ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో పైలెట్ మాట్లాడిన మాటలు అర్థం చేస్తున్నాయి. ‘విమానంలో పవర్ లేదు. నో థ్రస్ట్. గోయింగ్ డౌన్.. మేడే.. మేడే.. మేడే..’ అని పైలెట్ సుమత్ చెప్పారు. థ్రస్ట్ అంటే విమానాన్ని ముందుకు నడిపే శక్తి. ఇది విమానం ఇంజిన్లు లేదా ప్రొపెల్లర్ల ద్వారా ఉత్పత్తి అవుతుంది. థ్రస్ట్ అంటే నెట్టడం అనే అర్థం కూడా ఉంది. అయితే ఈ విమాన ప్రమాదానికి ఇంజిన్ లేదా ప్రొపెల్లర్ల వైఫల్యం కారణమని భావించవచ్చా? ప్రమాద కారణాలను అన్వేషించేందుకు జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది.
ఈ ఘటన మనకు ప్రధానంగా విమాన యానంలోని సాంకేతికత నైపుణ్యాలని మరింత సాధించాలన్న సత్యాన్ని చాటింది. సాధారణంగా విమనాలు బయలుదేరే ముందు దాని సామర్థ్యం, యంత్రాల పనితీరు, సాంకేతికతలు, లోపాలను పరిశీలించిన తరవాతనే ప్రయాణానికి సంసిద్ధమవుతారు. అలా జరిగిందా? లేదా? అలాగే ఆ ఎయిరిండియా విమానం ఢిల్లీ నుండి అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళుతున్నది. అహ్మదాబాద్ వరకు బాగానే వచ్చిన విమానం ఒక్కసారిగా ఎందుకలా అయ్యింది? మరే కోణమైనా ఉందా? అన్నవి తేలాల్సిన అంశాలు. 146 కోట్లు ఉన్న దేశ జనాభాకు తగ్గట్లుగా ఇప్పటికీ విమానయానం లేదు, విమానాలు లేవు, విమానాశ్రయాలు లేవన్న విమర్శలను ఒకసారి ఆలోచించుకోవాలి. తాజా ఘటనపై సునిశిత పరిశోధన జరగాలి.
నిజానికి అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన ఒళ్ళు జలదరింప చేస్తోంది. ఆ పెనువిషాదం గుండెలను పిండేస్తున్నది. వందల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఎందరో కలలను చిదిమేసింది. తప్పెవరిదైనా వందలాది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. కొన్ని బతుకులు ఛిద్రం అయ్యాయి. విమనాల ఉత్పత్తి మొదలు సాంకేతికత వరకు సమగ్ర అధ్యయనం చేయాలి. ఈ ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన విమానాల సంపూర్ణ ప్రక్షాళనకు సిద్ధపడాలి. దేశీయ విమానయాన సంస్థల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి. సాంకేతిక వైఫల్యాల నుంచి మానవ నిర్లక్ష్యం వరకూ ఈ ప్రమాదానికి దోహదం చేసిన అన్ని అంశాలను గుర్తించి, అవసరమైన చర్యలను చేపట్టాలి.