ప్రజల ఆస్తులకు కేర్ టేకర్ గా ఉండాల్సిన ప్రభుత్వాలు, ఆ ఆస్తులనే తెగనమ్ముతుండటాన్ని మించిన తెగబాటు ఇంకేముంటుంది? ప్రజా ప్రయోజనాల పేరుతో, ఉద్యోగ, ఉపాధి కల్పన సాకుతో, విదేశీ, స్థానిక ప్రైవేటు సంస్థలకు, పరిశ్రమలకు, అతి చౌకగా, అప్పనంగా భూములు అప్పగిస్తుండటం అత్యంత దారుణం. దుర్మార్గం. ఆతర్వాత అవే కంపెనీలు ఆయా భూములను వ్యాపారం చేసి, కోట్లు గడిస్తున్నాయి. తర్వాత కాలంలో ప్రభుత్వాలు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువైన భూములు కొన్ని సంస్థలు, మరికొన్ని పరిశ్రమలు, ప్రైవేట్ వ్యక్తుల వశం అవుతున్నాయి. ఇక ప్రభుత్వ పరిశ్రమలు, కార్యాలయాలు, సంస్థల కోసం భూములే లేక సేకరించాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. మరుగుదొడ్లకు, స్మశానవాటికలకు కూడా భూములు లేని దౌర్భాగ్యం దాపురిస్తోంది.
ఇటీవల హైదరాబాద్ కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూ వివాదం ఈ కోవలోనిదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ భూమిని ఓ పారిశ్రామిక వేత్తకు అప్పగించారు. దానిని ప్రస్తుత ప్రభుత్వం కోర్టు ద్వారా తిరిగి స్వాధీనం చేసుకున్నది. అదే భూమిని తిరిగి అమ్మకానికి సిద్ధపడింది. సుప్రీం కోర్టు జోక్యంతో సమస్య తీవ్రత తెలిసి వచ్చింది. పాలకులు తమ అవసరాలు లేదా ఉచిత పథకాలకు నిధుల సమీకరణ కోసం ఇష్టారీతిన భూములను అమ్ముతున్నారు. ‘‘మా రాష్ట్రానికి రండి. పెట్టుబడులు పెట్టండి. భూములు ఇస్తాం. విద్యుత్ ఇస్తాం. నీరు ఇస్తాం’’ అంటూ బీకారీ, బేహారుల్లా ప్రపంచాలు తిరుగుతున్నారు.
విశాఖలో గత వైసీపీ ప్రభుత్వ వైఖరినే తాజాగా టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తోంది. ఇప్పటికే రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూముల్లో కమర్షియల్ కార్యకలాపాల కారణంగా 15ఎకరాలను వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా టీసీఎస్కు కారుచౌకకు భూములు ఇవ్వడం వివాదంగా మారింది. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలోని రుషికొండ ప్రాంతంలో ఎకరానికి కేవలం 99 పైసల చొప్పున టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు 21.16 ఎకరాల భూమిని అప్పనంగా అప్పగించడం దారుణం. రుషికొండలో రాష్ట్ర రిజిష్ట్రేషన్ల శాఖ రేట్ల ప్రకారం ఒక చదరపు గజం రూ.30 వేలు ప్రాతిపదికగా తీసుకున్నా, ఒక ఎకరం రూ.15 కోట్ల విలువ చేస్తుంది. అంటే, టీసీఎస్కు ఇచ్చిన 21.16 ఎకరాల భూమి విలువ రూ.320 కోట్లకు మించి ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం 2012లో జారీ చేసిన జిఓఎంఎస్ నెం.571 ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు. 2జి స్పెక్టమ్ర్ కేసులో, ఇతర కేసుల్లో ప్రభుత్వ భూముల వంటి ప్రకృతి వనరుల విషయంలో ప్రభుత్వం ప్రజల ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలని, ఆ భూములను ప్రజా ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ సంస్థలకు మార్కెట్ ధర కన్నా తక్కువకు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చిన విషయం అందరికీ తెలిసిందే! ఆవిధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలనేగాక సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా టీడీపీ కూటమి సర్కారు ఉల్లంఘించినట్లే. ఒక్క 2024 ఏడాదిలో టీసీఎస్ రూ.62,165 కోట్ల లాభం గడించగా, అటువంటి కంపెనీకి 99 పైసల లీజుకు విలువైన ప్రభుత్వ భూమిని ముట్టజెప్పడం హాస్యాస్పదం. ఆక్షేపణీయం.
ఆ ప్రాంతంలో టీసీఎస్ ఒక ఐటి పరిశ్రమను పెట్టి 12 వేల ఉద్యోగాలు కల్పిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. కానీ, గతంలో చాలా కంపెనీల యాజమాన్యాలు భూములు కోట్టేశాయే తప్ప ఉద్యోగాలు కల్పించలేదు. పైగా వాటిని బ్యాంకుల్లో కుదువబెట్టి భారీగా రుణాలు తీసుకుని, ఆ తరవాత వాటినీ ఎగ్గొట్టిన ఉదంతాలెన్నో ఉన్నాయి. అనంతపురం లేపాక్షి మొదలు ఒంగోలు వాన్పిక్ శ్రీకాకుళం జిల్లా థర్మల్ కేంద్రాల వరకూ వేల ఎకరాల భూములు కార్పొరేట్ కంపెనీల కబంధ హస్తాల్లో చిక్కుకున్న విషయం చంద్రబాబుకు తెలియందికాదు. డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి పందేరాలు చూస్తూ ఉండడం సరికాదు.
వందలు, వేల ఎకరాలను సంపన్నులకు కట్టబెట్టే ప్రభుత్వ పెద్దలు ఒక్క సెంటు- భూమిని కూడా పేదలకు ఇవ్వడంలేదు. ప్రభుత్వ భూములను అధికారంలో వున్నవారు తమ అనుయాయులకు కట్టబెట్టే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం గత నాలుగు దశాబ్దాలుగా అమలవుతోంది. ఉమ్మడి ఆంధప్రదేశ్లో చంద్రబాబు, వైఎస్ హయాంలో ఇలాంటి పందేరాలు విచ్చలవిడిగా సాగాయి. ఇప్పుడు చంద్రబాబు మరోమారు అదే గారడీని ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 2006 నుండి 2011 మధ్య 88,492 ఎకరాల భూమిని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 1,027 వివిధ స్వదేశీ, విదేశీ కంపెనీలకు కట్టబెట్టింది. తద్వారా రాష్ట్ర ఖజానా అక్షరాలా లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందని కాగ్ తేల్చింది. ప్రస్తుతం ఓడరేవులు మొదలు విమానాశ్రయాలను సైతం అదానీ, అంబానీలకు కట్టబెడుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ తీరు చూస్తూనే ఉన్నాం. గంగవరం పోర్టు కోసం పోరాటం చేసి, భూములు అప్పగించిన వారు ఇప్పుడు నిరాశ్రయులయ్యారు. కానీ ఆ భూములను, పోర్టును ఆదానీ ఎగురేసుకు పోయారు.
ప్రైవేట్ కంపెనీలకు కారుచౌకగా భూములు అప్పగించడం, అనుచితమైన రాయితీలివ్వడం, చట్టాలను సడలించే విధానాలతో వచ్చే పెట్టుబడులు రాష్ర్టానికిగానీ, ప్రజలకుగానీ ప్రయోజనాలు కలిగించిన దాఖలాలు లేవు. ప్రపంచ ఐటీ రంగానికి టీసీఎస్ అతీతమేమీ కాదు. అన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకుంటుంటే టీసీఎస్ మాత్రం విశాఖలో కొత్తగా 12 వేల ఉద్యోగాలను ఎలా కల్పిస్తుంది? ప్రభుత్వం ఎలా నమ్ముతుంది? ప్రజల్ని ఎలా నమ్మిస్తుంది? ప్రభుత్వ భూములు పాలకుల సొంత ఆస్తి కాదు. మీ భూములనైతే ఇలాగే పంచేస్తారా? అంతా ఆలోచించాలి.
తెలంగాణలో రేవంత్ సర్కార్ కూడా ఫార్మాసిటీ పేరుతో ఇలాగే వ్యవహరిస్తోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇదే పెడధోరణిని విశ్రుంఖలంగా సాగించింది. ఇప్పుడేమో భూముల పందేరంపై నంగనాచిలా కొట్లాటకు దిగుతోంది. భూములను కట్టబెట్టడంలో అంతా ఆ తాను ముక్కలే! అన్నది ప్రజలు గ్రహించాలి.