Trending News
Sunday, December 7, 2025
17.2 C
Hyderabad
Trending News

ప్రభుత్వ భూములు పాలకుల ఆస్తులా!?

ప్రజల ఆస్తులకు కేర్ టేకర్ గా ఉండాల్సిన ప్రభుత్వాలు, ఆ ఆస్తులనే తెగనమ్ముతుండటాన్ని మించిన తెగబాటు ఇంకేముంటుంది? ప్రజా ప్రయోజనాల పేరుతో, ఉద్యోగ, ఉపాధి కల్పన సాకుతో, విదేశీ, స్థానిక ప్రైవేటు సంస్థలకు, పరిశ్రమలకు, అతి చౌకగా, అప్పనంగా భూములు అప్పగిస్తుండటం అత్యంత దారుణం. దుర్మార్గం. ఆతర్వాత అవే కంపెనీలు ఆయా భూములను వ్యాపారం చేసి, కోట్లు గడిస్తున్నాయి. తర్వాత కాలంలో ప్రభుత్వాలు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువైన భూములు కొన్ని సంస్థలు, మరికొన్ని పరిశ్రమలు, ప్రైవేట్ వ్యక్తుల వశం అవుతున్నాయి. ఇక ప్రభుత్వ పరిశ్రమలు, కార్యాలయాలు, సంస్థల కోసం భూములే లేక సేకరించాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. మరుగుదొడ్లకు, స్మశానవాటికలకు కూడా భూములు లేని దౌర్భాగ్యం దాపురిస్తోంది.

ఇటీవల హైదరాబాద్‌ కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూ వివాదం ఈ కోవలోనిదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ భూమిని ఓ పారిశ్రామిక వేత్తకు అప్పగించారు. దానిని ప్రస్తుత ప్రభుత్వం కోర్టు ద్వారా తిరిగి స్వాధీనం చేసుకున్నది. అదే భూమిని తిరిగి అమ్మకానికి సిద్ధపడింది. సుప్రీం కోర్టు జోక్యంతో సమస్య తీవ్రత తెలిసి వచ్చింది. పాలకులు తమ అవసరాలు లేదా ఉచిత పథకాలకు నిధుల సమీకరణ కోసం ఇష్టారీతిన భూములను అమ్ముతున్నారు. ‘‘మా రాష్ట్రానికి రండి. పెట్టుబడులు పెట్టండి. భూములు ఇస్తాం. విద్యుత్‌ ఇస్తాం. నీరు ఇస్తాం’’ అంటూ బీకారీ, బేహారుల్లా ప్రపంచాలు తిరుగుతున్నారు.

విశాఖలో గత వైసీపీ ప్రభుత్వ వైఖరినే తాజాగా టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తోంది. ఇప్పటికే రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూముల్లో కమర్షియల్‌ కార్యకలాపాల కారణంగా 15ఎకరాలను వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా టీసీఎస్‌కు కారుచౌకకు భూములు ఇవ్వడం వివాదంగా మారింది. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలోని రుషికొండ ప్రాంతంలో ఎకరానికి కేవలం 99 పైసల చొప్పున టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ కు 21.16 ఎకరాల భూమిని అప్పనంగా అప్పగించడం దారుణం. రుషికొండలో రాష్ట్ర రిజిష్ట్రేషన్ల శాఖ రేట్ల ప్రకారం ఒక చదరపు గజం రూ.30 వేలు ప్రాతిపదికగా తీసుకున్నా, ఒక ఎకరం రూ.15 కోట్ల విలువ చేస్తుంది. అంటే, టీసీఎస్‌కు ఇచ్చిన 21.16 ఎకరాల భూమి విలువ రూ.320 కోట్లకు మించి ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం 2012లో జారీ చేసిన జిఓఎంఎస్‌ నెం.571 ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వకూడదు. 2జి స్పెక్టమ్ర్‌ కేసులో, ఇతర కేసుల్లో ప్రభుత్వ భూముల వంటి ప్రకృతి వనరుల విషయంలో ప్రభుత్వం ప్రజల ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలని, ఆ భూములను ప్రజా ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్‌ సంస్థలకు మార్కెట్‌ ధర కన్నా తక్కువకు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చిన విషయం అందరికీ తెలిసిందే! ఆవిధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలనేగాక సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా టీడీపీ కూటమి సర్కారు ఉల్లంఘించినట్లే. ఒక్క 2024 ఏడాదిలో టీసీఎస్‌ రూ.62,165 కోట్ల లాభం గడించగా, అటువంటి కంపెనీకి 99 పైసల లీజుకు విలువైన ప్రభుత్వ భూమిని ముట్టజెప్పడం హాస్యాస్పదం. ఆక్షేపణీయం.

ఆ ప్రాంతంలో టీసీఎస్‌ ఒక ఐటి పరిశ్రమను పెట్టి 12 వేల ఉద్యోగాలు కల్పిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. కానీ, గతంలో చాలా కంపెనీల యాజమాన్యాలు భూములు కోట్టేశాయే తప్ప ఉద్యోగాలు కల్పించలేదు. పైగా వాటిని బ్యాంకుల్లో కుదువబెట్టి భారీగా రుణాలు తీసుకుని, ఆ తరవాత వాటినీ ఎగ్గొట్టిన ఉదంతాలెన్నో ఉన్నాయి. అనంతపురం లేపాక్షి మొదలు ఒంగోలు వాన్‌పిక్‌ శ్రీకాకుళం జిల్లా థర్మల్‌ కేంద్రాల వరకూ వేల ఎకరాల భూములు కార్పొరేట్‌ కంపెనీల కబంధ హస్తాల్లో చిక్కుకున్న విషయం చంద్రబాబుకు తెలియందికాదు. డిప్యూటి సిఎం పవన్‌ కళ్యాణ్‌ కూడా ఇలాంటి పందేరాలు చూస్తూ ఉండడం సరికాదు.

వందలు, వేల ఎకరాలను సంపన్నులకు కట్టబెట్టే ప్రభుత్వ పెద్దలు ఒక్క సెంటు- భూమిని కూడా పేదలకు ఇవ్వడంలేదు. ప్రభుత్వ భూములను అధికారంలో వున్నవారు తమ అనుయాయులకు కట్టబెట్టే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం గత నాలుగు దశాబ్దాలుగా అమలవుతోంది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో చంద్రబాబు, వైఎస్‌ హయాంలో ఇలాంటి పందేరాలు విచ్చలవిడిగా సాగాయి. ఇప్పుడు చంద్రబాబు మరోమారు అదే గారడీని ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 2006 నుండి 2011 మధ్య 88,492 ఎకరాల భూమిని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 1,027 వివిధ స్వదేశీ, విదేశీ కంపెనీలకు కట్టబెట్టింది. తద్వారా రాష్ట్ర ఖజానా అక్షరాలా లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందని కాగ్‌ తేల్చింది. ప్రస్తుతం ఓడరేవులు మొదలు విమానాశ్రయాలను సైతం అదానీ, అంబానీలకు కట్టబెడుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ తీరు చూస్తూనే ఉన్నాం. గంగవరం పోర్టు కోసం పోరాటం చేసి, భూములు అప్పగించిన వారు ఇప్పుడు నిరాశ్రయులయ్యారు. కానీ ఆ భూములను, పోర్టును ఆదానీ ఎగురేసుకు పోయారు.

ప్రైవేట్ కంపెనీలకు కారుచౌకగా భూములు అప్పగించడం, అనుచితమైన రాయితీలివ్వడం, చట్టాలను సడలించే విధానాలతో వచ్చే పెట్టుబడులు రాష్ర్టానికిగానీ, ప్రజలకుగానీ ప్రయోజనాలు కలిగించిన దాఖలాలు లేవు. ప్రపంచ ఐటీ రంగానికి టీసీఎస్‌ అతీతమేమీ కాదు. అన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకుంటుంటే టీసీఎస్ మాత్రం విశాఖలో కొత్తగా 12 వేల ఉద్యోగాలను ఎలా కల్పిస్తుంది? ప్రభుత్వం ఎలా నమ్ముతుంది? ప్రజల్ని ఎలా నమ్మిస్తుంది? ప్రభుత్వ భూములు పాలకుల సొంత ఆస్తి కాదు. మీ భూములనైతే ఇలాగే పంచేస్తారా? అంతా ఆలోచించాలి.

తెలంగాణలో రేవంత్‌ సర్కార్‌ కూడా ఫార్మాసిటీ పేరుతో ఇలాగే వ్యవహరిస్తోంది. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం కూడా ఇదే పెడధోరణిని విశ్రుంఖలంగా సాగించింది. ఇప్పుడేమో భూముల పందేరంపై నంగనాచిలా కొట్లాటకు దిగుతోంది. భూములను కట్టబెట్టడంలో అంతా ఆ తాను ముక్కలే! అన్నది ప్రజలు గ్రహించాలి.

Latest News

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

గురువారం డిసెంబర్ 04–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--శుక్లపక్షం దత్తాత్రేయ జయంతి తిధి శు.చతుర్దశి ఉదయం 07.37 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం కృత్తిక పగలు 03.12 వరకు ఉపరి రోహిణి యోగం శివ ఉదయం 11.45 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

భౌ భౌ…! భౌ భౌ…భౌ!!|DOGS|INDIA|SUPREME COURT

విచ్చలవిడిగా విస్తరిస్తోన్న వీధి కుక్కలు రెచ్చిపోతున్న పిచ్చి కుక్కలు కరచి, రక్కి, కొరికి పారేస్తున్న శునకాలు నియంత్రణకు ‘సుప్రీం’ ఆదేశాలు సాదుకునే రోజుల నుంచి... కుక్కలంటే భయపడే రోజులొచ్చాయ్ కుక్కకు కూడా ఓ రోజొస్తుందంటే ఏమో అనుకున్నాం! నిజంగానే...

ఒకే కుటుంబం నుంచి ఐదుగురు సర్పంచ్ పోటీదారులే|PANCHAYATI TRENDS

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ ఈ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఎస్సీ జనరల్‌గా రిజర్వ్‌ అయిన ఈ పంచాయతీ సర్పంచ్ పదవికి ఒకే కుటుంబానికి చెందిన...

గిదేం ఇచ్చెంత్రం!?|ADUGU TRENDS

‘నీల్లు పల్లమెరుగు.. నిజం దేవుడెరుగు!’ అన్నరు. నిజం సంగతేమో గనీ, నీల్లయితే పల్లానికే పోతయి గదా! నిజమా? కాదా? కనీ, ఓ దగ్గర మాత్రం నీల్లు మిట్టకు పోతున్నయుల్లా!? గిదైతే నిజమో, అబద్దమో కనీ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News