AMERICA| అమెరికా అధ్యక్షుడు TRUMP| ట్రంప్ అధికారంలోకి వచ్చి అప్పుడే ఆరునెలలు కావస్తోంది. ఈ ఆరు నెల్లలో ఈ అగ్ర రాజ్య అయ్యవారి ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. అమెరికా ఫస్ట్ అన్న నినాదపు చేష్టలు ఆ దేశాన్ని వినాశనం వైపు నడిపిస్తున్నాయని ఆ దేశ పౌరులే ఏకి పడేస్తున్నారు. అధ్యక్షుడి అంతుచిక్కని చర్యలను ఈసడించుకుంటున్నారు. చివరకు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇలా లాస్ఎంజిల్స్ లో ఆందోళనలు పరాకాష్టకు చేరాయి. ఆందోళనకారులపై మిలిటరీని ప్రయోగించడం, వారి వెనుక విదేశీ హస్తం ఉందనడం, ట్రంప్ చేతగాని తనమేగాక, బరితెగింపునకు నిదర్శనంగానే చెప్పాలి. అమెరికాలో ఎప్పటినుంచో వలస వ చ్చి అక్కడే కూలీనాలీ చేసుకుంటున్న వారిపై దాష్టీకం ప్రదర్శించడం ట్రంప్కే చెల్లింది. నిజానికి వారు లేకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఇతర దేశాల ప్రజలు చెమటోడ్చి అమెరికా ఆర్థికవ్యవస్థను నిలబెడుతున్నారు. ఇది ట్రంప్ గమనించక పోవడం ఆయన తెలివి తక్కువతనం.
‘ప్రాజెక్టు 2025’ పేరుతో ట్రంప్ ప్రజావ్యతిరేక విధానాలనే అమలు చేస్తున్నాడు. అనేక అంశాల్లో వేలు పెడుతూన్నాడు. తనకు తోచిన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాడు. ఇతర దేశాలవారిని పురుగుల్లాగా చూస్తున్నాడు. అక్రమంగా వలస వచ్చిన వారిని స్వదేశాలకు వెళ్ళాలి. లేకపోతే జైల్లో పెట్టాలని ఇచ్చిన ఆదేశాలతోనే ఇప్పుడు లాస్ ఏంజల్స్ నగరం ఆందోళనలతో అట్టుడుకుతోంది. కొద్ది రోజులుగా అక్రమ వలసదారులని అరెస్టు చేసి జైల్లో పెట్టడంతోనే ఇలా వీధుల్లోకి వస్తున్నారు. వారిని అదుపు చేసేందుకు ట్రంప్ మిలిటరీని దింపాడు. వలసదారులు శత్రు దేశాల మాదిరిగా లాస్ ఏంజల్స్ ను ఆక్రమించుకున్నట్లుగా చిత్రించాడు. వారి నుంచి నగరాన్ని విముక్తి చేయాలని సంకల్పించాడు. ఆ రాష్ట్ర గవర్నరే దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అక్రమ వలసదారులుగా చెబుతున్నవారు ఇప్పుడు అమెరికాలో కోట్లాదిగా ఉన్నారు. అక్కడ తలెత్తిన ఆర్థిక, ఉపాధి సమస్యలను పరిష్కరించటంలో విఫలమైన ట్రంప్ వలస వచ్చిన వారే అన్నింటికీ కారణమంటూ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ సిబ్బంది నగరమంతటా వందలాది మందిని అరెస్టు చేయటాన్ని జనం నిరసిస్తున్నారు. వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగారు. తమ అధికారాన్ని అతిక్రమించి మిలిటరీని దించటాన్ని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ న్యూసమ్ కోర్టులో సవాలు చేశాడు. వెనక్కు తగ్గేది లేదని ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ మరింతగా రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. ట్రంప్ తీరుతో ప్రస్తుతం లాస్ ఏంజల్స్ లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అణచివేత ఏ రూపం తీసుకుంటుందో, దానికి ప్రతిఘటనలో ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది.
నిజానికి చౌకగా పని చేయించుకొని లాభాలు పొందేందుకు అమెరికా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, వ్యవసాయ క్షేత్రాల వారు వలసలను ప్రోత్సహించారు. చట్టబద్ధంగా వచ్చిన వారితో పాటు అక్రమంగా వచ్చిన వారిని చూసీచూడనట్లు అధికార యంత్రాంగం వ్యవహరించింది. అయితే వీరంతా చెమటోడ్చడం వల్లనే అక్కడి ప్రగతి రథచక్రాలు కదులుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో వారి పాత్ర తక్కువేమీ కాదు. వ్యవసాయం, సేవారంగం, నిర్మాణ రంగాలలో వారు కీలకంగా పని చేస్తున్నారు. ఇలాంటి వారివల్ల లాభాలు పొందుతున్న వారు మాత్రం కిమ్మనడం లేదు. వీరు వెళ్లిపోతే ఆయా పనులు చేసేందుకు అమెరికాలో ఒక్కరంటే ఒక్కరుకూడా మిగలరు. కరోనా తరువాత ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు, ద్రవ్యోల్బణం తగ్గటానికి వలస కార్మికులు తోడ్పడ్డారని డలాస్ ఫెడరల్ రిజర్వు బ్యాంకు అధ్యయనం తెలిపింది. అమెరికాలో పుట్టి పెరిగిన వారు ఉద్యోగ విరమణ చేయటం, జననాల రేటు తగ్గిన కారణంగా 2019-21 మధ్య 20 లక్షల మంది కార్మికులు తగ్గినట్లు, రానున్న 10సంవత్సరాలలో వలస కార్మికులు లేకపోతే వివిధ రంగాలలో ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణలో ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరికలు వెలువడ్డాయి. రానున్న రోజుల్లో అమెరికాలో వంట, ఇంటి పనివారు, డ్రైవర్లు, ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ వంటి పనులు చేసేందుకు డిమాండ్ పెరగనుందని చెబుతున్నారు. వలస వచ్చిన వారి కారణంగానే స్థానికులకు అందాల్సిస సౌకర్యాలకు కోత పడుతున్నదని కొందరు సర్వేలు, బడ్జెట్ల పేరుతో రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. వలస వచ్చిన వారి గృహ వసతి కోసం న్యూయార్క్ వంటి నగరాల్లో బడ్జెట్ కేటాయింపులు చేస్తూ ఇతరులకు కోత పెడుతున్నారని చిత్రీకస్తున్నారు.
నిజానికి పైన చెప్పుకున్నట్లుగా వలస వచ్చిన వారి నుంచి వచ్చే రాబడితో పోల్చుకున్నపుడు ఇవి పెద్ద మొత్తాలేమీ కాదు. వారు పని చేస్తున్న పరిశ్రమలు, వాణిజ్య, వ్యవసాయ రంగాల నుంచి వారి సంక్షేమానికి ప్రభుత్వం పన్నులు మరొక రూపంలో అదనంగా నిధులు సేకరించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ వారికి నానాటికీ మరిన్ని రాయితీలు ఇస్తున్నారు తప్ప అదనపు రాబడికి పూనుకోవటం లేదు. నైపుణ్యం అంతగా అవసరం లేని, తక్కువ వేతనాలకు పని చేసే కార్మికులు ఇప్పుడు అమెరికాకు అవసరమని తెలిసినప్పటికీ ట్రంప్ వారి విూద దాడి ప్రారంభించాడు. లాస్ ఏంజిల్స్ భగ్గుమనడానికి కారణం కూడా ఇదే. ఎప్పుడో ఏళ్ల క్రితం వచ్చి అమెరికానే తమదేశంగా స్థిరపడిపోయిన వారిపై దాడి చేయడం దారుణంగా వారు భావిస్తున్నారు. వారు లేకుంటే ఏ పనీ నడవదని ట్రంప్కు కూడా తెలుసు. అయితే మూర్ఖుల నిర్ణయాలకు ప్రజలు బలి కావాల్సి ఉంటుంద్న నిజాన్ని ట్రంప్ రుజువు చేస్తున్నారు.