న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల తర్వాత నగరంలోని ఫ్లైఓవర్లను పూర్తిగా బంద్ చేయనున్నట్లు వెల్లడించారు. బైకులు, లారీ లాంటి వాహనాలకు అనుమతి లేదని తెలిపారు. గతంలో జరిగిన ప్రమాదాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ముఖ్యంగా వేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో ఈ ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు.
ముఖ్యంగా, డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో పోలీసులు నిఘా చర్యలను మరింత పెంచారు. పబ్లు, బార్లు, ఫామ్హౌస్లు, హోటళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మైనర్లను పబ్లకు అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజేలకు అనుమతి లేకుండా శబ్ద కాలుష్యాన్ని నివారించాలని ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్తో పాటు ఇతర ముఖ్య నగరాల్లో కూడా పోలీసులు నిఘా పెంచారు. సివిల్ పోలీసులతో పాటు నార్కోటిక్, ఎక్సైజ్, ఎస్ఓటి విభాగాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. జనసమూహాల్లో ఆకస్మిక తనిఖీలతో పోలీసులు నిబంధనలు అమలు చేస్తూ కొత్త సంవత్సరం వేడుకలను సురక్షితంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.