రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ రద్దు తరవాత కాశ్మీర్ అభివృద్ధి చెంది, పర్యాటకంగా పునరుత్తేజం పొందడాన్ని ఉగ్రవాదులు, వారికి సహకరిస్తున్న పాక్ జీర్ణించుకోలేకపోతోంది. అందులో భాగమే పహల్గామ్ ఉగ్రదాడి. అయితే ఈ దాడిని ముందే పసిగట్టడంలో భద్రతాబలగాలు విఫలం అయ్యాయి. ఇదొక గుణపాఠంగా కాశ్మీర్ను రక్షించుకోవడం ఎలా అన్నదానిపై ద్రుష్టి సారించాలి. శ్రీలంకలో ఈలం అన్నది లేకుండా చేసిన విధంగానే ఇప్పుడు కాశ్మీర్ని మన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి. లెఫ్ట్ తీవ్రవాదం కన్నా ఇస్లామిక్ తీవ్రవాదం చాలా ప్రమాదకరంగా పరిణమించింది. మావోయిస్టులను ఏరివేసే పనిని పక్కన పెట్టి కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించే పనిని ముమ్మరం చేయాలి.
2008లో ముంబై దాడి తర్వాత సివిలియన్లపై జరిగిన రెండో అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. జమ్మూ కాశ్మీర్ ప్రాంతం పాకిస్థానీ తీవ్రవాదులకు ఇంకా నిలయంగానే ఉందని ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తున్నది. తహావూర్ హుస్సేన్ రాణాను అమెరికా భారత్కు అప్పగించిన తర్వాత దేశంలో ఉగ్రవాద చర్యలు జరిగే అవకాశం ఉందనే సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్ ముందుగానే తెలిపింది. అయితే, పర్యాటక స్వర్గథామంగా ఉన్నా జమ్మూకాశ్మీర్ ను అప్రమత్తంగా ఉంచడంలో కేంద్ర, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. జమ్మూకాశ్మీర్ లో మతపరమైన లక్ష్యాలు సాధించేందుకు ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇస్లామిక్ టెర్రిరిస్ట్ గ్రూపులు అయిన లష్కర్ -ఏ -తోయిబా, జైష్ -ఏ – మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు ఈ దాడులు చేస్తున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉగ్రవాదాన్ని అణచివేసే శక్తి లేకపోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని రక్షించే పనికి పూనుకోవాల్సి ఉంది.
28మంది పర్యాటకులను దారుణంగా హతమార్చిన ఉగ్రవాదులు పాకిస్థాన్కు చెందిన వారు లేదా, ఆ దేశంతో సంబంధాలున్న స్థానిక ఉగ్రవాదులుగా నిర్ధారణ జరిగింది. ఈ నేపథ్యంలో భారత్ ఈ దాడిని తీవ్రంగా పరిగణించింది. సౌదీ అరేబియా పర్యటనను అర్థంతరంగా ముగించుకుని బుధవారం ఉదయం భారత్ తిరిగివచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం నుంచి కశ్మీర్లో పరిస్థితిపైన ఎడతెరిపి లేకుండా కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సంచలన నిర్ణయాలు తీసుకొంది. సార్క్ ఒడంబడికలో భాగంగా సభ్యదేశమైన పాకిస్థాన్ పౌరులకు జారీ చేసిన వీసాలన్నిటినీ రద్దు చేసింది. ఈ వీసాలున్న పాకిస్థాన్ పౌరులు 48గంటల్లోగా భారత్ను వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఇక పాకిస్థాన్ దేశ పౌరులను భారత దేశంలోకి అనుమతించేది లేదని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇప్పటికే సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశించిన పాక్ పౌరులు మే 1వ తేదీ లోగా తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. అటారీ వాఘా వద్ద ఇరుదేశాల సరిహద్దుల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టును సైతం తక్షణమే మూసి వేసింది. మన దేశంలోని పాక్ దౌత్య కార్యాలయంలో ఉన్న రక్షణ లేదా, మిలిటరీ సలహాదారులను వెనక్కి పంపించి వేయాలని నిర్ణయించింది. అలాగే పాక్లోని మన దౌత్యకార్యాలయంలో ఉన్న ఈ సలహాదారులను కూడా వెనక్కి పిలిపిస్తారు. మే 1నుంచి మొత్తం విూద ఇరు దేశాల హైకమిషన్ కార్యాలయాల్లో సిబ్బందిని ఇప్పుడున్న 55నుంచి 30కి కుదించాలని నిర్ణయించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ తన మద్దతును నిలిపివేసే దాకా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపి వేయాలని కూడా సమావేశం నిర్ణయించింది. 1960లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సింధు నదితో పాటుగా దాని ఉపనదుల ద్వారా పాక్లోని లక్షలాది ఎకరాలకు సాగు నీటితో పాటు పలు ప్రాంతాలకు తాగు నీరు లభిస్తుంది.
పాక్ తన శక్తియుక్తులను కేవలం ఉగ్రదాడులకే ఉపయోగిస్తోంది. భారత్ నుంచి ఎలాంటి సాయం అందకుండా చూడాలి. అన్ని రకాలుగా నిర్వీర్యం చేయాలి. పాక్ను ప్రపంచంతో వేరు చేసే అన్ని చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అనేక మారణహోమాలు సాగాయి. ఇలాగే వదిలేస్తే మరిన్ని దాడులు జరిగే ప్రమాదాలు ఉన్నాయి. భారత్పై కన్నేస్తే ఖతమే అన్నంతగా పరిస్థితులు మారాలి. టెర్రరిస్టుల దాడులను తీవ్రంగా పరిగణించి, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. తాజా దాడిలో ప్రత్యేకంగా హిందూ వర్గంవారిని గుర్తించి మరీ కాల్పులు జరపడం మత మౌఢ్యంతో కూడిన మూర్ఖపు చర్య. పహల్గాంలో జరిగిన సంఘటనలో బాధితుల ముందు తీవ్రవాదులు చేసిన వ్యాఖ్యలు అత్యంత అమానవీయమైనవి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు వారి వ్యాఖ్యల్లో కనిపిస్తున్నాయి. గత మూడేళ్లుగా కాశ్మీర్ పర్యాటక రంగం పుంజుకుంది. కాశ్మీరీలకు ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. ఉగ్రవాదులు చేసిన మత వైషమ్య మారణకాండ, పుంజుకుంటున్న కాశ్మీర్ ఆర్థిక పరిస్థితిని తిరిగి దెబ్బతీసే అవకాశం ఉంది. అలాగే కాశ్మీర్ పర్యాటక రంగం మళ్లీ దెబ్బతింటే, అది కాశ్మీరీల ఉపాధిపైన తీవ్రమైన ప్రభావం చూపనుంది. కేంద్రం తీసుకున్న కొన్ని చర్యలు సమర్థనీయమైనవి. స్వాగతించాల్సిందే.
ఇవన్నీ చేస్తూనే కాశ్మీర్లో నిరంతర నిఘా పెంచాలి. ఉగ్రవాదుల ఏరివేతకు పూనుకోవాలి. పాక్తో సరిహద్దుల్లో భద్రత పటిష్టం చేయాలి. ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్ర శిక్షణ శిబిరాలను నిర్వీర్యం చేయాలి. అవసరమైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మన దేశంలో విలీనం చేసుకోవాలి. అందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేయాలి. భారత్ బలమేంటో పాక్తోపాటు ప్రపంచానికి చాటాలి.