ఎన్నో ఏళ్ల చిరకాల వాంఛ అయిన ఎస్సీ వర్గీకరణను చేసినందుకు ధన్యవాదాలు నాకు మాత్రమే కాదు.. మన నాయకుడు రాహుల్ గాంధీకి తెలియజేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీలో ఎస్సీ సంఘాల నాయకులు రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ… రాహుల్ గాంధీ లేకపోతే వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే శక్తి నాకు వచ్చేది కాదన్నారు. అలాగే భవిష్యత్ లో న్యాయపరమైన చిక్కులు ఉండకూడదనే వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. వన్ మెన్ కమిషన్ 199 పేజీల నివేదిక ఇచ్చిందని, ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. ఈ వర్గీకరణ వ్యతిరేకంగా చేసింది కాదన్నారు. అలాగే వర్గీకరణ ద్వారా ఎస్సీలకు న్యాయం చేయాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. గత పాలనలో వర్గీకరణ తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారని చెప్పారు. కానీ పదేళ్లలో పరిష్కారం కాని సమస్యకు మేం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే పరిష్కారం చూపామన్నారు. అలాగే సుప్రీం కోర్టులో బలంగా వాదనలు వినిపించి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చేందుకు కృషి చేశాం అని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేదని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ సుప్రీం తీర్పు అమలు చేయలేదన్నారు. కానీ మేం అమలు చేసే ప్రక్రియను మొదలుపెట్టామని గర్వంగా చెప్పారు. ఈ న్యాయపరమైన హక్కుల సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నాం.. ఇప్పుడు సాధించుకున్నాం అని చెప్పారు. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా మాదిగ బిడ్డ కుమార్ ను నియమించామని, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ప్రొఫెసర్ ఖాసీం గారిని నియమించామని, ఉన్నత విద్యామండలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్, విద్యాకమిషన్ లలో మాదిగలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటేనే… భవిష్యత్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పారు. ఈ వర్గీకరణ గొప్ప అవకాశం.. ఇది పది మందికి ఉపయోగపడేలా చూడాలని, కుర్చీలో మీ వాడిగా నేనున్నా… మీకు మంచి చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదన్నారు. ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో పనిచేయండి.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

