అయ్యప్ప భక్తులకు శబరిమల దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమల లో ప్రస్తుతం కుంభమాస పూజలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు ఆలయం తెరిచే ఉంటుంది. అయితే అయ్యప్ప దర్శనం విధానంలో కీలక మార్పులను చోటుచేసుకోనున్నాయి. భక్తుల రద్దీని నియంత్రించేందుకు 1989లో ఏర్పాటు చేసిన బ్రిడ్జిని తొలగించే పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఇకపై ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్ర 18 మెట్లు ఎక్కగానే, అయ్యప్ప సన్నిధిలో దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు పదునెట్టాంబడి ఎక్కగానే భక్తులను ఎడమవైపునకు మళ్లించేవారు. అక్కడి నుంచి 500 మీటర్ల దూరం ఉండే ఫ్లైఓవర్ (Flyover) మీదుగా సన్నిధానం చేరుకునే వారు. కానీ ఇప్పుడు వంతెనను తొలగించనుండటంతో మెట్లు ఎక్కగానే స్వామిని దర్శనం చేసుకోవచ్చు.
అయితే.. మార్చి 14వ తేదీన మీనమాస పూజ కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజ స్తంభానికి ఇరువైపులా రెండు లేదంటే నాలుగు లైన్ల దారిలోకి అనుమతిస్తారు. అక్కడి నుంచి నేరుగా బలికలుర (కణిక్కవంచి-నైవేద్య పాత్ర) మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప సన్నిధికి చేరుకోవచ్చు. అయితే ఈ మార్పులతో కణిక్కవంచి నుంచి వెళ్తే 30 సెకన్ల నుంచి నిమిషం పాటు అయ్యప్పను దర్శించుకునే అవకాశం లభిస్తుంది.
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్

