హైదరాబాద్ డెస్క్, ఆగస్టు 26 (అడుగు న్యూస్):
వినాయక చవితి ఉత్సవాలకు గణనాథుడు ముస్తాబయ్యాడు. రెండు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో, పలు పట్టణాల్లో, గ్రామాల్లో, గల్లీలో గణనాథులను ప్రతిష్టించి, పూజలు చేయనున్నారు. అందులో భాగంగా రాజస్థాన్ కళాకారులు పీవోపీ, తాటిపీచు, కొబ్బరిపీచుతో వివిధ ఆకృతులు, రంగుల్లో గణనాథులు, పర్యావరణ ప్రేమికులు మట్టితో విగ్రహాలను తయారుచేశారు. అడుగు ఎత్తు నుంచి 20 అడుగుల విగ్రహాలను గణేశ్ ఉత్సవ నిర్వాహకులు కొనుగోలు చేస్తున్నారు. విగ్రహాల ఎత్తును బట్టి వేల నుంచి లక్షల ధర పలుకుతోంది. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ గణేష్ పూజలకు ముస్తాబయ్యాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు చోట్ల భారీ విగ్రహాలు పూజలు అందుకొనున్నాయి.
పాలకుర్తిలో:
జనగామ జిల్లా, పాలకుర్తి మండల కేంద్రంలో మొట్ట మొదటి వినాయకుడిని ప్రతిష్టించి, నేటికి ఎన్నో ఏళ్లుగా నవరాత్రులు నిర్వహిస్తున్న క్రాంతి యూత్ ఈ సారి బాల గణేషుడిని ప్రతిష్టించి పూజలు చేయనున్నట్లు బాధ్యులు తెలిపారు. అలాగే ఎంతో చరిత్ర కలిగిన గుడివాడ విఘ్నేశ్వర కమిటీ ప్రతి సంవత్సరం విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించి,పూజిస్తూ, ఈ ఏడాది 50వ సంవత్సరంలోకి వస్తున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా గుడివాడ విఘ్నేశ్వర కమిటీ అధ్యక్షుడు చారగొండ్ల శివ & వారి బృందం రామకృష్ణ, రేపాల అశోక్, చాట శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూర్తి హంగులతో పర్మినెంట్ మండపం నిర్మించి, గణేషుడిని ప్రతిష్టించి పూజలు చేయనున్నారు. ఈ ఉత్సవాలకు 15 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అడుగుతో కమిటీ అధ్యక్షుడు శివ ఫోన్ లో మాట్లాడుతూ, ఈ సారి భారీ ఎత్తున, ఊహించని రీతిలో నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సారి తమ కుటుంబమే దాతగా మట్టి గణపతిని ఇస్తున్నట్లు తెలిపారు.



నిబంధనలు పాటించాల్సిందే..
ఆహ్లాదకర వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు కృషి చేయాలని డీజీపీ డా.జితేందర్ పిలుపునిచ్చారు. మండపాల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలు, భద్రతా అంశాలపై ఆయన సూచనలు చేశారు.
ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి
వినాయక ఉత్సవ కమిటీలు మండపాల ఏర్పాటు, ఉత్సవాలకు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. గణేశ్ ఉత్సవ.నెట్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్లో అవసరమైన వివరాలను నింపాలి. దరఖాస్తును పరిశీలించిన తర్వాత పోలీసులు అనుమతిస్తారు.
విద్యుత్ జాగ్రత్తలు:
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ వైరింగ్ను నిపుణులతో చేయించాలి.
సౌండ్ సిస్టమ్:
లౌడ్ స్పీకర్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలి. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మతపరమైన ప్రదేశాల వద్ద మైకులు వాడకూడదు.
నిఘా:
మండపాలలో రాత్రిపూట కమిటీ సభ్యులు కాపలా ఉండాలి. మండపాలలో విలువైన వస్తువులను ఉంచకూడదు. శాంతి భద్రతల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
రోడ్డు భద్రత:
విగ్రహాలను, మండపాలను రోడ్లపై ఏర్పాటు చేయరాదు. బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రజలకు, ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బందులు కలిగించకూడదు.
ఊరేగింపు, నిమజ్జనం నిబంధనలు
నినాదాలు, ప్రదర్శనలు:
ఊరేగింపు సమయంలో కులలాలు, మతాలు లేదా పార్టీలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే నినాదాలు, అనుచిత ప్రదర్శనలు, అసభ్యకరమైన నృత్యాలు చేయకూడదు. డీజే, బాణసంచాకు అనుమతి లేదు.
వాహనాల నియమాలు:
నిమజ్జనం వాహనాలకు లైసెన్స్ ఉన్న డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలి. మద్యం సేవించిన వారు లేదా మైనర్లు వాహనంపై ఉండకూడదు.
నిమజ్జన సమాచారం:
నిమజ్జనం మార్గం, సమయం, తేదీ వివరాలను పోలీసులకు తప్పనిసరిగా తెలియజేయాలి. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా కమిటీ సభ్యులు తగినంత మంది వాలంటీర్లను ఏర్పాటు చేయాలి.
భద్రతా ఏర్పాట్లు:
నిమజ్జన ప్రదేశాల్లో గజ ఈతగాళ్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి.
అవాంఛనీయ సంఘటన జరిగినా, జరగడానికి అవకాశం ఉన్నా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు లేదా డయల్ 112కు సమాచారం ఇవ్వాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు.

