ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ తెలంగాణ సమాజంలో పరిచయం అవసరం లేని ప్రముఖ విద్యావేత్త. కవి రచయిత. జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన ఉద్యమకారుడిగా ఇలా బహుముఖ కోణాల్లో తన పాత్రను మహోన్నతంగా నిర్వర్తించారు. అతడే ఒక ప్రభంజన పథంగా నిలిచారు. ప్రస్తుతం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరు ఆయన స్వస్థలం. సాహిత్యం, ఉద్యమ నేపథ్యం గల ప్రాంతం నుంచి వచ్చిన ఆయన సాహిత్యంలోనూ ఉద్యమాల్లోనూ తన ప్రత్యేకతను లిఖించుకున్నారు. అనారోగ్యంతో అకాలంగా తనువు చాలించారు. ఇప్పుడు ఒక ధిక్కార స్వరం, అణగారిన జనాల గొంతుక మూగబోయింది. అట్టడుగు వర్గాల రాజ్యాధికారం కోసం, సామాజిక న్యాయం కోసం, సామాజిక తెలంగాణ కోసం పరితపించి, ఆరాటపడి పోరాటం కొనసాగిస్తూనే తుది శ్వాస వదిలారు. ఈ సందర్భంగా ఆయనతో నాకున్న కొద్దిపాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాను.
పాతికేళ్ల కిందట యువజనోద్యమాల్లో నేను చురుకుగా పాల్గొంటున్నప్పుడు ప్రభంజన్ తో పరిచయం ఏర్పడింది. సోమనాథ కళాపీఠం నిర్వహించిన కార్యక్రమాల్లోనూ, కొన్ని పుస్తకాల ఆవిష్కరణ సందర్భంలోనూ వారితో కలిసి మాట్లాడిన సమయాలు అరుదుగా ఉన్నాయి. అణగారిన తరగతులతో రాజ్యాధికార సదస్సు పాలకుర్తిలో ఓరోజు నిర్వహించబడింది. ఆ సదస్సులో నేను మాట్లాడిన కొన్ని మాటలతో ఆయనతో సన్నిహితంగా మాట్లాడేందుకు అవకాశం కలిగింది. అలా ఏర్పడిన అనుబంధం నేటికీ కొనసాగుతూ వచ్చింది. నా రాజకీయ ప్రయాణంతో ఆయనకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మంచి చెడులను పంచుకోవడానికి సామాజిక పోరాట, సాహిత్య, వర్గ బంధం బలపడుతూ వచ్చింది.
ఈ ప్రాంతంలో కొనసాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రభావం ఆయనపై ఎంతో ఉంది. కమ్యూనిస్టు రాజకీయాలు, వైఫల్యాలు గుర్తు చేస్తూ ఉండేవారు. కమ్యూనిస్టులు అంటే ఎందుకు వ్యతిరేకత అంటూ ప్రశ్నించిన సందర్భం కూడా ఉంది. సమాధానం చెబుతూనే కమ్యూనిస్టులో బలం పెరిగితే తప్ప దేశంలో ప్రజాస్వామ్యం నిలబడదని చెప్పారు. రోజురోజుకూ వామపక్ష పార్టీలు క్షీణిస్తున్న నేపథ్యంలో గుణపాఠాలు నేర్చుకోవడం లేదని ఎప్పుడు అంటుండేవారు. విప్లవోద్యమ పురోభివృద్ధిపై, సామాజిక అంశాలపై, ఆధిపత్య భావజాలంపై, ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణంపై చర్చిస్తూ సూచనలు చేసేవారు. సామాజిక ఉద్యమాల అవసరాన్ని నొక్కి చెబుతూ సామాజిక శక్తులు, కమ్యూనిస్టులు ఉద్యమాల్లోనూ, ఎన్నికల్లోను కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.
నేను పాలకుర్తి లైబ్రరీలో పనిచేసిన సమయంలో లైబ్రేరియన్ మధుసూదన్ రావు, ప్రభంజన్ తో కలిసి చర్చించిన అంశాలు ప్రత్యేకమైనవి. 2011లో నేను వేసిన వికసించని మందారాలు కవితా సంపుటిని చదివి మెచ్చుకున్నారు. పోషక కులాలు, ఆశ్రిత కులాల జీవన సంబంధాలు, నేడు వాటి స్థితిగతులపై రాసిన కవిత్వం ఆయన నోటి వెంట విన్న సందర్భం ఇంకా గుర్తుంది. వారు రాసిన అంతర్యం, ప్రభంజన పథం మరికొన్ని పుస్తకాలు నాకు అందించారు. ‘మట్టిలో మాణిక్యం మామిండ్ల సాయిలు’ అంటూ ఆయన రాసిన వ్యాసాన్ని గుర్తు చేయడంతో సాయిలు సాహిత్యాన్ని చర్చించారు.
అప్పటికే వారి రచనలను నేను కొన్ని చదివి ఉంటిని. నా అభిప్రాయాలను సూటిగా వ్యక్తం చేయడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2015లో ‘విప్లవ మూర్తి ఐల్లమ్మ’ పుస్తకాన్ని వెలువరించినప్పుడు చాలా కాలానికి ఒక బలహీన వర్గానికి చెందిన ఉద్యమ మహిళ జీవిత గాధను తీసుకువచ్చావని, అది ప్రమాణికమైందంటూ ప్రభంజన్ అభినందించారు. ప్రజాశక్తి దినపత్రికలో సాయుధ పోరాట యోధుల కథనాలు చదివి మరుగున పడిన చరిత్రల్ని కండ్ల ముందు చూపెట్టావంటూ అక్షరబద్ధం చేయడం ఆనందంగా ఉందన్నారు.
నవ తెలంగాణ చార్వాక పేజీలో రాస్తున్న సామాజిక ఉద్యమకారుల జీవిత గాధలు, కవుల కళాకారుల కథనాలను చదివి ఫోన్ చేసి మాట్లాడేవారు. సామాజిక వివక్షతల అంశాలపై రాసినప్పుడు మా తమ్ముడు రమేష్ రాజా చేస్తున్న కృషి అసాధారణమైనదంటూ ప్రోత్సాహించారు. 2017లో ‘సామాజిక కిరణాలు’ పుస్తకాన్ని చదివి ఇలాంటి పుస్తకాలను మరెన్నింటినో సమాజానికి అందించాల్సిన బాధ్యత ప్రతి రచయితపై ఉందన్నారు. ఒక కమ్యూనిస్టు ఉద్యమకారుడు కుల దురహంకార హత్యలపై, సామాజిక అణిచివేతలపై సీరియస్ గా రాయడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. మాస పత్రికల్లో వచ్చిన నా కథలను చదివి కథలు కూడా చాలా బాగా రాస్తున్నావు, యదార్థ గాధలను కథలుగా తీసుకువచ్చావంటూ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
2018లో లిబరేషన్ రాజకీయాలను ప్రారంభించినప్పుడు, బీహార్ రాజకీయాలను నాతో చర్చించారు. ఆ ప్రాంతంలో భూస్వామ్య శక్తులతో, ప్రైవేటు సైన్యాలతో లిబరేషన్ ప్రతిఘటన పోరాటాలు నిర్వహించిందని, సామాజిక అణచివేతలపై అద్భుతమైన కృషిని చేసిందంటూ వివరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తిలో తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేసినప్పుడు సుదీర్ఘ ఆదిపత్య రాజకీయ కోటలో ఓ మినుగురులా కనిపించావంటూ ధైర్యాన్నిచ్చారు. 2020లో బీహార్ లో లిబరేషన్ పార్టీ 19 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసి 12 గెలిచింది. వారందరి పరిచయాలను వివిధ పత్రికల్లో అందించడంతో అవన్నీ చదివి బీహార్ తరహ ఉద్యమాలను తెలంగాణ పరిస్థితులకు అన్వయించుకొని పనిచేయాలన్నాడు. దేశంలో ఫాసిస్ట్ శక్తులు బలపడుతుండడంతో తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తిని లిబరేషన్ కొనసాగించాలని, ఆ వెలుగులో ఉద్యమాల నిర్మాణం జరగాలన్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార పార్టీ నాపై పెట్టిన కుట్ర కేసును గుర్తు చేస్తూ, పాల్కురికి సోమనాథ స్మృతి వనంలో గంట సేపు ప్రత్యేకంగా ప్రభంజన్ ఇంటర్వ్యూ చేశారు. దానిని మండల్ టీవీలో ప్రసారం చేశారు. మండల్ టీవీ లక్ష్యాన్ని, దాని విస్తరణపై చర్చించడం జరిగింది. నన్ను రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయమని సూచించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఆదికవి పాల్కురికి సోమనాథుడు పేరు పెట్టాలని డాక్టర్ రాపోలు సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు సోమనాథుడి సాహిత్యం, ప్రస్తుత రాజకీయాలను మరికొన్ని విషయాలను ఆయనతో పంచుకోవడం జరిగింది.
మా నాన్న కామ్రెడ్ మామిండ్ల ఎల్లయ్య జీవనగమనంపై పుస్తకాన్ని తీసుకువచ్చే క్రమంలో గతేడాది డిసెంబర్ 20న ఫోన్లో ప్రభంజన్ తో మాట్లాడినప్పుడు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిసింది. అప్పటికే చికిత్స పొందుతూ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ పొడిపొడిగా మాట్లాడారు. తనకి ఆరోగ్యం సహకరిస్తే నాన్న పుస్తకానికి సందేశం రాస్తానని చెప్పారు. పుస్తకానికి ఏ పేరు పెడుతున్నావంటూ ఆరా తీశారు. మా నాన్న – నా హీరో అంటూ టైటిల్ చెప్పినప్పుడు, దానిని ‘నాన్నే నా హీరో’ పెడితే బాగుంటుందని సూచించారు.
మల్లొకసారి ఈ ఏడాది ప్రారంభంలో మాట్లాడిన సందర్భంలో ఆరోగ్యం కుదుటపడిందని చెప్పి ప్రత్యామ్నాయ రాజకీయాలపై సమావేశం నిర్వహిస్తున్నామని, ఆ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. కార్యక్రమాల ఒత్తిడిలో ఆ సమావేశానికి వెళ్లలేకపోయాను. మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా, ప్రత్యామ్నాయ రాజకీయాలను అందించేందుకు ఏకాభిప్రాయం కలిగిన అంశాలపై కలిసి పని చేద్దామని ఆలోచన చేసాం. ఈ సమయంలోనే సామాజిక తెలంగాణ కోసం, బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రభంజన్ ఆకస్మికంగా మన నుంచి భౌతికంగా జులై 16 న దూరమయ్యారు. ఆయన మృతి సామాజిక న్యాయ పోరాటాలకు తీరనిలోటు. వారి ఉన్నతమైన ఆలోచనలు, ఆశయాలు భవిష్యత్తులోనూ జరిగే ప్రజా ఉద్యమాల్లో సజీవంగా ఉంటాయి.

– మామిండ్ల రమేష్ రాజా
78932 30218

